తల్లిని చంపిన కొడుకులు అరెస్ట్​

తల్లిని చంపిన కొడుకులు అరెస్ట్​

నర్సింహులపేట, వెలుగు: మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కొడుకులు ఆమెను కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అడెపు కౌసల్య(68)కు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు నారాయణ సూర్యాపేట జిల్లా నిమ్మికల్ లో ఉంటున్నాడు. రెండో కొడుకు రమేష్ మద్యానికి బానిసై భార్యను వదిలి తల్లి వద్ద ఉంటున్నాడు. మూడో కొడుకుకు పెళ్లి కాలేదు. ఇద్దరు కొడుకులు తరచూ మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లితో గొడవపడేవారు. జులై 29న ఇలానే గొడవపడ్డారు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న పైపుతో తలపై బలంగా కొట్టారు. దీంతో కౌసల్య మృతిచెందింది. ఇద్దరూ విషయం దాచి దహన సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. పెద్దకొడుకు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దహన సంస్కారాన్ని అడ్డుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో తలపై బలంగా కొట్టడంతో మృతిచెందినట్లు తేలింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు.