అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెట్టి.. సెక్స్ రాకెట్ నడిపిన కేడీ లేడీకి 24 ఏళ్ల జైలు శిక్ష

అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెట్టి.. సెక్స్ రాకెట్ నడిపిన కేడీ లేడీకి 24 ఏళ్ల జైలు శిక్ష

అభం శుభం తెలియని అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి నెట్టి.. సెక్స్ రాకెట్ నడిపిన కేడీ లేడీకి 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింధి కోర్టు. ఆమె పాపం పండి.. 12 ఏళ్ల వయసులో తన చెరలో చిక్కిన బాలిక కొన్నేళ్ల తర్వాత తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడంతో కటకటాల పాలైంది. దాదాపు ఆరేళ్ల పోరాటం తర్వాత కోర్టు తీర్పు వెలువడింది. యూపీ, ఢిల్లీలలో అతి పెద్ద సెక్స్ రాకెట్ నిర్వాహకురాలైన గీతా అరోరా అలియాస్ సోనూ పంజాబన్‌పై హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్, బాలికలను హింస పెట్టిన కేసుల్లో రూ.64 వేల జరిమానాతో పాటు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీలోని ద్వారాకా కోర్టు. ఈ కేసులో బుధవారం తీర్పు చెప్పే సందర్భంగా స్త్రీ అని కొంచెం కూడా జాలి చూపించాల్సిన పని లేదని అన్నారు న్యాయమూర్తి ప్రీతం సింగ్. ఆమె అనుచరుడు సందీప్ బెద్వాల్‌కు కూడా రూ.65 వేల ఫైన్, 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

‘‘బ్యాడ్ బాయ్స్’’ ఫ్యాంటసీ.. జైలుకెళ్లొచ్చినా మార్పులేదు

మహిళ అన్న దయ కూడా చూపాల్సిన పని లేదని జడ్జి వ్యాఖ్యలు చేశారంటేనే ఈ కేడీ లేడీ ఏ రేంజ్‌లో ఘోరాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో చాలా సిటీల్లోనే దందా నడిపింది సోనూ. ఎప్పుడూ ‘‘బ్యాడ్ బాయ్స్’’తోనే ఉండాలన్న ఫ్యాంటసీలతో ఉండేది. ఈ కలలతో 2003లో తొలిసారి ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్‌ని లవ్ చేసి పెళ్లాడింది. అయితే సోనూతో వివాహమైన కొద్ది రోజులకే యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఓ ఎన్‌కౌంటర్‌లో విజయ్ మరణించాడు. కొన్నాళ్లకే దీపక్ అనే మరో గ్యాంగ్‌స్టర్‌లో ప్రేమలో పండింది. అతడూ అస్సాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆ తర్వాత దీపక్ సోదరుడు హేమంత్ సోనూకి ఆమె దగ్గరైంది. దీంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే హేమంత్ కూడా హైప్రొఫైల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిని 2006 మార్చిలో ఢిల్లీ, గుర్గావ్ బోర్డర్‌లో స్పెషల్ సెల్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపారు. ఇలా ఏడాదికో గ్యాంగ్‌స్టర్‌ని పెళ్లాడుతూ అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచారంలోకి దించడం, కొన్నాళ్ల తర్వాత వాళ్లను అమ్మేయడం లాంటి నేరాలకు పాల్పడుతూ వచ్చింది సోనూ పంజాబన్. 2007లో తొలిసారి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చినా తన తీరు మార్చుకోలేదు. మళ్లీ ఇదే నేరంపై 2008లో మరోసారి అరెస్ట్ అయింది. మళ్లీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి సెక్స్ రాకెట్ నడపడం లాంటి పనులు కొనసాగించడం చేసింది. మూడేళ్ల తర్వాత  2011లో ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్టయింది. మళ్లీ బెయిల్.. మళ్లీ అదే పని.. ఇలా అభంశుభం తెలియని అమ్మాయిలపై నేరాలు పాల్పడుతున్న సోనూ పాపం పండింది. 2017లో ఓ 12 ఏళ్ల అమ్మాయి కేసులో పట్టుబడిన ఆ కేడీ లేడీకి ఎట్టకేలకు కఠిన శిక్ష పడింది.

12 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి..

సోనూ అనుచరుడు సందీప్ బెద్వాల్ ఓ 12 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుందామని చెప్పి, 2009 సెప్టెంబర్ 11న ఆమెను తీసుకుని వెళ్లి సీమా అనే ఓ మహిళ ఇంట్లో పెట్టాడు. అక్కడ ఆ చిన్నారిని రేప్ చేసి.. సీమాకు అమ్మేసి పరారయ్యాడు. ఆపై ఆ బాలిక ఒకరి తర్వాత ఒకరి చేయి మారుతూ పలువురి దగ్గర అమ్మకానికి గురైంది. చివరికి సోనూ దగ్గరకు చేర్చాడు సందీప్. ఆమె ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించింది. డ్రగ్స్ ఇచ్చి తన కస్టమర్ల దగ్గరకు పంపేది. అలా కొన్నాళ్ల పాటు ఆ బాలికను హింసించిన సోనూ ముగ్గురు వ్యక్తులకు అమ్మేసింది. చివరకు సత్పాల్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడి దగ్గర నుంచి 2014లో తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ బాలిక తను అనుభవించిన చిత్రవధల గురించి పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత 2017 డిసెంబర్‌లో సోనూ పంజాబన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. సుదీర్ఘ విచారణల ఢిల్లీలోని ద్వారక జిల్లా కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసు నమోదైన తర్వాత దాదాపు ఆరేళ్లకు కఠిన శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రీతం సింగ్ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధిత బాలికకు రూ.7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.