
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రైమ్ ఏరియాల్లో ఉన్న పబ్స్ లో తరచూ డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. వెస్ట్రన్ కల్చర్ మోజులో పెద్దఎత్తున యువత డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. తాజాగా... హైదరాబాద్ పబ్బుల్లో మరోసారి డ్రగ్స్ బాగోతం బయటపడింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో శుక్రవారం ( జూన్ 13 ) ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి.
గచ్చిబౌలి లోని ఎస్ఎల్ఎన్ టర్మినల్ మాల్ లో ఉన్న క్లబ్ రౌగ్, ఫ్రాట్ హౌస్ పబ్స్ లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీల్లో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పబ్ లోని డీజే ప్లేయర్ సైతం డ్రగ్స్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలిపారు పోలీసులు. పాజిటివ్ వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పబ్ ల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తే సహించేదిలేదని.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు. ఇదిలా ఉండగా.. మే 25న చేపట్టిన ఈ తనిఖీల్లో కూడా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తీసుకున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మాదాపూర్, గచ్చిబౌలిలోని అకాన్, A 19 పబ్ లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పబ్ ల దగ్గర డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా రెండు పబ్ లలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలిపారు పోలీసులు.
నిందితులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా జరుగుతోంది.. ముఖ్యంగా ఐటీ హబ్ లు అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సహా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో ఉన్న పబ్ లలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.