సికింద్రాబాద్, వెలుగు : సరుకు రవాణా, లోడింగ్లో అత్యుత్తమ రికార్డును దక్షిణ మధ్య రైల్వే సాధించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ 26 నాటికి కేవలం 8 నెలల 26 రోజుల వ్యవధిలో 100 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరకును లోడ్ చేయడంలో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ ఫీట్ సాధించడానికి 270 రోజులు మాత్రమే తీసుకుంది. గత ఆర్థిక ఏడాదిలో 2022– --23లో 284 రోజుల్లో 100 మిలియన్టన్నుల సరకు రవాణా చేసింది. 50.635 మిలియన్ టన్నుల బొగ్గు, 25.226 మిలియన్ టన్నుల సిమెంట్,
5.961 మిలియన్ టన్నుల ఎరువులు, 5.161 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 3.396 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ముడి పదార్థాలు, 2.722 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 7.752 మిలియన్ టన్నుల ఇతర వస్తువులతో కలిసి మొత్తం 100.853 మిలియన్ టన్నులు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. సరకు రవాణాలో 100 మిలియన్ టన్నుల మైలు రాయిని అధిగమించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.