- వైజాగ్ నుంచి షిప్లో కొరియా వెళ్లాలని అమ్మాయిల ప్లాన్
- ఈరోడ్ నుంచి చెన్నై వచ్చాక.. మనసు మార్చుకున్న బాలికలు
- సేఫ్గా ఇండ్లకు చేర్చిన పోలీసులు
చెన్నై: సౌత్ కొరియన్ పాపులర్ బ్యాండ్ బీటీఎస్ ట్రూప్ అంటే ఆ అమ్మాయిలకు విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే వాళ్లను ఇండ్లలోంచి పారిపోయేలా చేసింది. తమిళనాడుకు చెందిన 8 వ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు.. ఎలాగైనా తమ ఫేవరెట్ స్టార్స్ బీటీఎస్ ట్రూప్ ను చూడాలనుకున్నారు. అందుకు సౌత్ కొరియాలోని సియోల్కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. చెప్పాపెట్టకుండా ఇండ్లలోంచి బయల్దేరి చెన్నైదాకా పోయారు. చేతిలో డబ్బులు, పాస్పోర్ట్ లేకుండా ముందుకెళ్లడం సాధ్యం కాదని తెలుసుకుని పోలీసుల సాయంతో సొంతిండ్లకు చేరుకున్నారు.
ప్యాకెట్ మనీ 14 వేలతో బయల్దేరి..
తమిళనాడు ఈరోడ్కు దగ్గర్లోని ఓ ప్రభుత్వ స్కూల్లో 8వ క్లాస్ చదువుతున్న 13 ఏండ్ల వయసు అమ్మాయిలు వాళ్లు. పాస్పోర్ట్ లేకున్నా సియోల్ వెళ్లొచ్చని ఇంటర్నెట్ద్వారా తెలుసుకున్నారు. విశాఖపట్నం నుంచి షిప్లో సియోల్ పోవచ్చని ప్లాన్ చేశారు. ప్యాకెట్ మనీ కలెక్షన్స్ రూ.14 వేలు తీసుకుని ఈరోడ్ నుంచి ఈ నెల 4న చెన్నైకి రైలెక్కారు. అక్కడ అతికష్టంమీద లాడ్జిలో రూమ్ దొరికించుకున్నారు. రూమ్ కోసం పడిన తిప్పలో.. లేక డబ్బులు సరిపోవని అనుకున్నారేమో కానీ మనసుమార్చుకున్నారు.
ఇంటికి తిరిగి వెళ్లిపోయేందుకు ఆదివారం చెన్నై నుంచి ఈరోడ్కు రైలెక్కారు. మధ్యలో నీళ్లకోసం వెల్లూర్ జిల్లాలోని కాట్పాడిలో దిగడంతో రైలు మిస్సయింది. అప్పటికే ఈ బాలికలు మిస్సింగ్ అన్న వార్తతో అలర్టయిన పోలీసులు.. సోదాలు చేస్తూ ఈ అమ్మాయిలను గుర్తించారు. వాళ్లు చైల్డ్ లైన్ అధికారులకు అప్పగించడంతో తల్లిదండ్రులను పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చి ఇండ్లకు పంపించారు.