
- ఓల్డ్ సిటీలో గోల్డ్ చోరీ నిందితుల అరెస్ట్
- 56 గ్రాముల బంగారం, రూ.90 వేలు రికవరీ
- పరారీలో మరో ముగ్గురు
హైదరాబాద్,వెలుగు: ఓల్డ్ సిటీలో బంగారం దోపిడీ చేసిన ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 56 గ్రాముల గోల్డ్, రూ.90 వేల నగదు రికవరీ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం.. వెస్ట్ బెంగాల్కు చెందిన షేక్ రోస్తిక్(39),షేక్ అజిజుల్(33) కొంతకాలం కింద కుటుంబాలతో సిటీకి వచ్చారు. వీరు హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలోని మీర్చౌక్ కాళీకమాన్లో ఉంటున్నారు.
షేక్ రోస్తిక్, షేక్ అజిజుల్ ఘాన్సీబజార్లోని జువెలరీ మేకింగ్ షాపులో పని చేస్తుండగా.. అక్కడ గోల్డ్ కొనుగోలు, అమ్మకాలతో పాటు సెక్యూరిటీ లోపాలను గుర్తించారు. దీంతో బంగారం చోరీకి ప్లాన్ చేశారు. వెస్ట్ బెంగాల్లోని తమ ఫ్రెండ్స్ బాపీ, మాణిక్, కార్తీక్ కు దోపిడీ స్కెచ్ చెప్పి సిటీకి రప్పించారు. తాము పనిచేసే గోల్డ్ మేకింగ్ షాపు వద్ద రెక్కీ వేశారు. ఈనెల 5న వెళ్లి షాపులో పనిచేసేవారికి కత్తులు చూపించి, 80 గ్రాముల గోల్డ్, 2 మొబైల్ ఫోన్స్, రూ.2000 క్యాష్ ఎత్తుకెళ్లారు. జువెలరీ షాపు ఓనర్ ఫిర్యాదు తో హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా షేక్ రోస్తిక్, షేక్ అజిజుల్ ను ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా నిందితులు బాపీ,మాణిక్,కార్తీక్ కోసం గాలింపు చేపట్టారు.