ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ట్రాన్స్జెండర్లు కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం.ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ.75 వేల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం
ఈ పథకం కింద మంజూరు చేసే రుణాలు పూర్తిగా సబ్సిడీతో కూడుకున్నవి కావడంతో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపింది ప్రభుత్వం. ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం ద్వారా సాయం అందించనుంది ప్రభుత్వం. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న ట్రాన్స్జెండర్లు ఈ పథకానికి అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపారు.
ఈ పథకం కింద హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30స్వయం ఉపాధి యూనిట్లను కేటాయించింది ప్రభుత్వం. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో నాంపల్లిలోని మనోరంజన్ కంప్లెక్స్ లో ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అధికారులు. www.wdsc.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని కూడా ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అధికారులు. జనవరి 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని.. మరిన్ని వివరాల కోసం 9640452773 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు అధికారులు.
