
- వనపర్తి జిల్లా పెబ్బేరులో 7.1 సెంటీ మీటర్ల వర్షం
- సోమవారం నుంచి భారీ వర్షాలు
- ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని అన్ని చోట్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 5.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 5.2, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 5.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లా రాపోలులో 4.1, సూర్యాపేట జిల్లా నడిగూడెం, మెదక్ జిల్లా మాసాయిపేటలో 4, రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో 3.9, ములుగు జిల్లా వాజేడు, నల్గొండ జిల్లా పజ్జూరులో 3.4, కరీంనగర్ జిల్లా రేణికుంటలో 3.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలో నమోదైన టాప్ టెన్ అత్యధిక వర్షపాత ప్రాంతాలన్నీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాంతాలే. ఇటు హైదరాబాద్లోనూ సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది.
బండ్లగూడలో అత్యధికంగా 2.8 సెంటీ మీటర్లు, సరూర్నగర్, బహదూర్పురలో 2.4, చంపాపేటలో 2.3, కందికల్ గేట్, గచ్చిబౌలిలో 2.2, లింగోజిగూడ, ఫూల్బాగ్, బార్కస్లో 2.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉంటాయని.. సోమ, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.