ఇళ్ళు లేని నిరుపేదల కోసం ప్రత్యేకంగా టౌన్ షిప్

ఇళ్ళు లేని నిరుపేదల కోసం ప్రత్యేకంగా టౌన్ షిప్

డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాన్ని సందర్శించిన స్పీకర్, మంత్రులు

రంగారెడ్డి జిల్లా: ఈ ఏడాది డిసెంబర్  మాసానికి సుమారు 85వేల ఇళ్లను పేదలకి అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టుని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ కొనసాగుతున్న పనులను సమీక్షించారు. స్పీకర్ మరియు మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరుని తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి కాంట్రాక్ట్ ఏజెన్సీ తోపాటు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు.

ఈ టౌన్ షిప్ రికార్డుల్లోకెక్కుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇళ్ళు లేని నిరుపేదల కోసం, ప్రత్యేకంగా టౌన్ షిప్ నిర్మించడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అన్నారు. అన్ని వసతులతో, ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కొల్లూరు మోడల్ టౌన్ షిప్ పేదలకు వరం అన్నారు. దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు.

హైదరాబాద్ లో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పైన, వాటి పురోగతి పైన హర్షం వ్యక్తం చేసిన హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. తమ శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు, స్పీకర్ కొల్లూరు లో  కల్పించాల్సిన సౌకర్యాల పైన కొన్ని సలహాలు, సూచనలు అందించారు.

speaker pocharam, Ministers KTR and prashanth reddy inspected the 2BHK dignity housing project site at Kollur, rangareddy dist.