కమ్మవారితో ముప్పై ఏండ్లుగా అనుబంధం : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కమ్మవారితో ముప్పై ఏండ్లుగా అనుబంధం : పోచారం శ్రీనివాస్​రెడ్డి
  •     ఎన్టీఆర్​ను చూసే రాజకీయాల్లోకి వచ్చా
  •     స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి 

వర్ని, వెలుగు :  కమ్మవారితో తనకు ముప్పై ఏండ్లుగా ఆత్మీయబంధం ఉందని, ఎన్టీఆర్​చొరవతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వర్నిలో పోచారం శ్రీనివాస్​రెడ్డికి మద్దతుగా కమ్మ కులస్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్​మాట్లాడుతూ.. కమ్మ సామాజికవర్గం వారిని ఎప్పుడూ తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న తనను ప్రోత్సహించి రాజకీయాల వైపు నడిపించిన తన రాజకీయ గురువు శ్రీనివాస్​రావు ఈ కులానికి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు.

రాష్ట్రంలోనే మొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగిందన్నారు. బాన్సువాడ లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదని పోచారం ఎద్దేవా చేశారు. మూడో సారి కేసీఆర్​ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్పీకర్​సతీమణి పుష్ప, కుమారులు సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ని మండలం నెహ్రూ నగర్ కు చెందిన అప్పసాని శ్రీనివాస రావు పోచారం నామినేషన్​కోసం రూ.25,000 నగదు సహాయం అందించారు.