Wonder : ఈ చిన్న బౌల్.. గిన్నె రూ.248 కోట్లా.. వెయ్యి సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఎలా ఉంది..?

Wonder : ఈ చిన్న బౌల్.. గిన్నె రూ.248 కోట్లా.. వెయ్యి సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఎలా ఉంది..?

ఒక బౌల్ కొనాలంటే ఎంత ఖర్చు చేస్తాం. మహా అయితే రెండు వందల నుంచి రెండు వేలు. కానీ.. చైనాలో ఓ బౌల్ దక్కించుకోవడానికి ఓ శ్రీమంతుడు ఏకంగా 248 కోట్ల రూపాయలు చెల్లించాడు. అరుదైన ఆ బౌల్ ఎక్కడిది? దానికి అంత ధర ఎందుకు చెల్లించాడు?

కొన్ని వార్తలు చదవడానికి భలేగా అనిపిస్తాయి.  అసలు నిజంగా ఇలా జరిగి ఉంటుందా? అనిపిస్తాయి. ఈ వార్త కూడా అలాంటిదే. చిన్న బౌల్​ కు  కోట్ల రూపాయలు చెల్లించి కొన్న సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. 

హాంకాంగ్ లో జరిగిన వేలంపాటలో ఈ బౌల్​ ను  ఒక అజ్ఞాత వ్యక్తి 248 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు. ఇంతకీ ఆ బౌల్​ ను  అంత ధర పెట్టి కొనడానికి కారణమేంటి అనుకుంటున్నారా? ఆ బౌల్ చైనాలోని సాంగ్ అనే రాజవంశానికి చెంది నది. 13 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న ఆ బౌల్ నీలం, ఆకుపచ్చరంగులో ఉంది. వెయ్యి సంవత్సరాల క్రితం ఈ బౌల్​ ను  బ్రష్​ లు  కడగడానికి ఉపయోగించేవారట. 

సదబీ అనే చైనాకు చెందిన ఓ సంస్థ ఈ బౌల్​ ను  వేలంపాట వేసింది. ఇందులో పాల్గొన్నవారంతా కోటీశ్వరులే కావడం విశేషం. అంతేకాదు.. వేలంపాటలో పాల్గొన్నవారిలో ఎవరూ వేలంపాట జరిగే ప్లేస్​ కు  వెళ్లలేదు. అందరూ ఫోన్లోనే వేలంపాటలో పాల్గొన్నారు. రూ. 67 కోట్ల రూపాయలతో మొదలైన వేలంపాట క్షణాల్లో వందల కోట్లకు చేరింది. అత్యంత అరుదైన ఈ బౌల్​ ను  దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. 

ఇలాంటి బౌల్స్​ ప్రపంచంలో నాలుగు మాత్రమే ఉన్నాయట. 2014లో మింగ్ వంశానికి చెందిన వైన్ తాగే బౌల్​ ను  ఇలాగే వేలంపాట వేశారు. అప్పుడు ఆ బౌల్​ ను  లియు అనే చైనా శ్రీమంతుడు రూ.235 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బౌల్ వేలంపాటలో రూ.248 కోట్ల ధర దక్కించుకోవడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది..