- 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు అక్కడే విధులు
- పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ
హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క -సారలమ్మ మహాజాతర -2026 కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనున్న నేపథ్యంలో జాతరలో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను (డీపీవోలు) జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లను (డీఎల్పీవోలు) సెక్టోరల్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరంతా ఈ నెల 24న ఉదయం 10 గంటల కల్లా ములుగు
కలెక్టర్కు రిపోర్ట్ చేయాలి. 24 నుంచి ఫిబ్రవరి 2 జాతర ముగిసేంత వరకు విధుల్లో ఉండాలి.
ములుగు డీపీవోతో సమన్వయం చేసుకుంటూ 24 గంటలు పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి. జాతర డ్యూటీ వేసిన అధికారులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఉత్తర్వులు ధిక్కరిస్తే కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తప్పదని పంచాయతీరాజ్శాఖ హెచ్చరించింది. ములుగు కలెక్టర్ కోరిన వెంటనే ఆయా జిల్లాల నుంచి ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులను రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది.
