సెక్రెటరియేట్ వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు,అక్రమ ప్రమోషన్స్ నిలిపివేయాలని ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఎల్బీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో తపస్ (TPUS),UTF ఆధ్వర్యంలో టీచర్స్ ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బదిలీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీచర్స్.. అక్రమ బదిలీలకు ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. సాధారణ బదిలీలకు ముందు ఇలా చెయ్యడం అన్యాయమని.. దొడ్డి దారి బదిలీలను ఖండించారు. ఈ విధమైన బదిలీలు చేయడం ద్వారా ఎన్నో ఏండ్లుగా సాధారణ బదిలీల కొరకు ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు తీరని నష్టం, అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో పారదర్శకంగా బదిలీలు చేస్తామని చెప్పిన రాష్ట్ర విద్యా శాఖ ఇయాల ప్రభుత్వమే పారదర్శకతకు పాతరేసి పైరవీ బదిలీలకు తెరతీస్తే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు సెక్రెటరియేట్ వేదికగా 140 అక్రమ బదిలీలు జరిగాయని అన్నారు. పైరవీ బదిలీలు ఆపాకపోతే జిల్లా వ్యాప్తంగా అన్యాయానికి గురైన ఉపాధ్యాయులందరం ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంటనే ఈ దొడ్డిదారి అక్రమ బదిలీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ లోని జిల్లా పరిషత్ స్కూల్ లో ప్రమోషన్స్ కోసం సర్టిఫికేషన్స్ వేరిపికేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు.
