తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగనుంది. ఈ క్రమంలో జనవరి 31వ తేదీ బుధవారం తిరుమలలో వేద సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. వేద సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన అధికారులకు చైర్మన్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన హిందూ ధర్మాన్ని మారుమల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యం తో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేద సద్సస్సు కు దేశ వ్యాప్తంగా 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు హాజరవుతున్నారని కరుణాకర రెడ్డి చెప్పారు. వారి సలహాలు, సూచనలతో ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.
ఫిబ్రవరి 3, 4, 5 వ తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న ఈ వేద సదస్సుకు దేశవ్యాప్తంగా గల మఠాలు, పీఠాలకు చెందిన స్వామీజీలతోపాటు భావసారూప్యం గల సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సును సజావుగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులతో టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ కమిటీలోని అధికారులు పర్యవేక్షిస్తారు.