వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఎనిమిదో రోజు శనివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీమలయప్పస్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహనసేవ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శేఖర్ రెడ్డి, శివకుమార్, డిపి అనంత, సివిఎస్వో గోపినాథ్జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని అయిన మహల్లో స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది.
సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శనివారం ఉదయం 7 గంటలకు రథోత్సవం బదులుగా శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు.