పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని కత్తిపోట్లు

పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని కత్తిపోట్లు

పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

వివరాలలోకి వెళితే మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన సురేష్ వివాహం జరిగింది. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లి రోజే సర్వేశ్.. బాలమణి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సురేష్ సోదరి బాలమణిని దూషించాడు. అయితే బంధువులందరు సర్ది చెప్పి.. పెళ్లి తర్వాత మాట్లాడదామని బాలమణికి చెప్పారు. ఆదివారం ఉదయం బాలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బందువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్ళింది. సర్వేశ్ సోదరుడు శేఖర్ వచ్చిన వారిపైకి రెచ్చిపోయాడు. ఆవేశంతో ఇంట్లోకి వచ్చిన సర్వేశ్‌కు.. తల్లి కత్తి ఇచ్చిందని.. ఆ కత్తితో తమపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాధితులు తెలిపారు. సర్వేశ్ చేతిలోని కత్తి తీసుకొని శేఖర్ కూడా దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో ప్రవీణ్ (30), నోముల పరశురాము(35), యాదగిరి (42), ప్రతాప్ కుమార్ (32) తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు గాయాలపాలైన వారితోనే పోలీస్ స్టేషన్‌‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీస్ స్టేషన్‌లో మొత్తం రక్తం మరకలు ఏర్పడ్డాయి. స్పందించిన పోలీసులు.. వెంటనే బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  కాగా.. దాడికి పాల్పడిన నిందితులు పరారు కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.