టోల్ ఫీజు చెల్లించాలన్నందుకు ఇద్దరి మధ్య వాగ్వివాదం చివరకు సిబ్బందిపై దాడికి దారి తీసింది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు టోల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద కలకలం రేపింది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ నంబర్-17 టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్కు చెందిన సతీష్, రాకేష్, రాజేష్ అనే ముగ్గురు యువకులు కారులో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. వారి కారుకు ఫాస్ట్ట్యాగ్ లేకపోవడంతో, టోల్ రుసుము చెల్లించాలని డ్యూటీలో ఉన్న సిబ్బంది సందీప్ కోరాడు.
అయితే తమ వద్ద నగదు లేదంటూ ఆ యువకులు టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం కాస్తా ముదిరి ఘర్షణగా మారడంతో, మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు టోల్ ఉద్యోగి సందీప్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | కన్న కూతురిపై ఏడాదిగా అఘాయిత్యం.. వికారాబాద్ లో తండ్రిపై పోక్సో కేసు నమోదు
