
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవంలో తొక్కిసలాట జరిగింది. వేడుకలకు భారీగా జన సమీకరణ చేసిన అధికారులు.. మంచినీరు, అల్పాహారం ఏర్పాట్లలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. గేట్ నంబర్ 2 వద్ద టోకెన్లతో టిఫిన్ తీసుకునేందుకు వెళ్లినవారు, అల్పాహారం అయిపోవడంతో కొత్తగా తెచ్చిన టిఫిన్కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ తోపులాటలో గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ స్టూడెంట్ నజిమా (19) కిందపడిపోయంది.
ఆమె మెడ, కడుపుపై తొక్కడంతో స్పృహ కోల్పోయింది. బాధితురాలిని వెంటనే కొండాపూర్ జిల్లా హాస్పిటల్కు, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. నజిమా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. సీటీ స్కాన్ ద్వారా మరింత పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్, సూపరింటెండెంట్ డా. అనురాగిని రెడ్డి బాధితురాలిని పరామర్శించారు. సరైన ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని పలువురు విమర్శించారు.