
హైదరాబాద్ లోని హైటెక్స్లో శనివారం జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈవెంట్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ అవార్డుల కోసం గత ఆరు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేశాం. అవార్డులు తీసుకున్న వారంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరికి ఎఫ్డీసీ తరపున నా ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి.
షూటింగ్లతో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా ఆ వేడుకకు వచ్చి అవార్డ్ తీసుకోవాలి. భవిష్యత్లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్ వస్తే కచ్చితంగా స్వీకరించాలని నా రిక్వెస్ట్. త్వరలో ఏపీలో కూడా అవార్డులు వస్తాయి. వాటిని కూడా బాధ్యతగా స్వీకరించాలి. రెండు రాష్ట్రాలు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివి. ఇక ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాళ్లు బాధపడి ఉంటే వాళ్లకు ఎఫ్డీసీ తరపున క్షమాపణలు కోరుతున్నా’ అని అన్నారు.