- మూడో క్వార్టర్లో రూ.14,205 కోట్లు
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గత రికార్డులను బద్దలుకొట్టింది. వరుసగా మూడో క్వార్టర్లోనూ భారీ లాభం సంపాదించింది. దీనికి ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర లాభం 68 శాతం పెరిగి రూ. 14,205 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) ఏడాదికి 24 శాతం పెరిగి రూ.38,068.8 కోట్లకు చేరుకుంది. దేశీయ అడ్వాన్సులు 16.91 శాతం, విదేశీ అడ్వాన్సులు 21.47 శాతం పెరిగాయి. లోన్లగ్రోత్ఈ క్వార్టర్లో 17.60 శాతం పెరిగి రూ. 26,64,602 నుంచి రూ. 31,33,565 కోట్లకు చేరింది. దేశీయ అడ్వాన్స్ల వృద్ధికి రిటైల్ ఇండివిడ్యువల్ అడ్వాన్స్లు, కార్పొరేట్ అడ్వాన్స్లు కారణమని కంపెనీ తెలిపింది. ఎస్ఎంఈలకు లోన్లు 14.16 శాతం, వ్యవసాయ లోన్లు 11.52 శాతం పెరిగాయి. హోల్బ్యాంక్ డిపాజిట్లు పోయిన ఏడాది రూ. 38,47,794 కోట్ల నుంచి ఈ క్వార్టర్లో 9.51 శాతం పెరిగి రూ. 42,13,557 కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు 5.88 శాతం పెరిగాయి. ఖాతాల పరంగా చూస్తే బ్యాంక్ యోనో యాప్ ద్వారా 64 శాతం సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఖాతాలు, 41 శాతం రిటైల్ అసెట్ ఖాతాలను నిర్వహిస్తోంది. మొత్తం లావాదేవీలలో ప్రత్యామ్నాయ ఛానెల్స్ వాటా 2022 ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో 97.2 శాతం నుంచి 95.3 శాతానికి పెరిగింది.
అదానీ గ్రూపునకు రూ.27 వేల కోట్ల లోన్లు
అదానీ గ్రూప్కు మొత్తం దాదాపు రూ. 27,000 కోట్ల విలువైన లోన్లు ఇచ్చామని, మొత్తం లోన్బుక్లో ఇది 0.88 శాతానికి సమానమని స్టేట్బ్యాంక్ తెలిపింది. తమ విదేశీ బ్రాంచ్లు రూ.1,638 కోట్ల విలువైన లోన్లు ఇచ్చాయని వెల్లడించింది. ఈ విషయమై ఎస్బిఐ ఛైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు లోన్ల చెల్లింపునకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవన్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.3,853 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఎన్నడూ లేని విధంగా 2022 డిసెంబరుతో ముగిసిన మూడవ క్వార్టర్లో అత్యధికంగారూ.3,853 కోట్ల నికర లాభం (స్టాండ్లోన్) సాధించింది. ఇది క్రితం సంవత్సరం మూడో క్వార్టర్ లాభం రూ.2,197 కోట్లతో పోలిస్తే 75శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.8,552 కోట్ల నుంచి (వార్షికంగా) 26శాతం పెరిగి రూ.10,818 కోట్లకు చేరుకుంది. అక్టోబర్–-డిసెంబర్ కాలంలో నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.37శాతం ఉంది. సీక్వెన్షియల్గా ఇది 24 బేసిస్ పాయింట్లు పెరిగింది. బ్యాంక్ 2022 డిసెంబర్ నాటికి మొత్తం రూ.20,73,385 కోట్ల వ్యాపారాన్ని సాధించింది. ఏడాదికి 18.5శాతం వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం మూడో క్వార్టర్లో 50శాతం పెరిగి రూ.8,232 కోట్లకు చేరుకుంది. గ్రాస్ఎన్పీఏలు 5.31 శాతం నుంచి 4.53శాతానికి పడిపోయాయి. నికర ఎన్పీఏలు 0.99 శాతం నుంచి 1.16శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్గా కేటాయింపులు రూ.1,627.5 కోట్ల నుంచి రూ.2,507 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై 20, 1908న ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్. గుజరాత్లోని వడోదరలో హెడ్క్వార్టర్ఉంది. 'ఆల్టర్నేటివ్ మెకానిజం' పథకం కింద 2019 ఏప్రిల్ ఒకటో తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్లను విలీనం చేశారు.