
- అధికారులతో మంత్రులు సీతక్క, పొన్నం కీలక చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా సంఘాల ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, తద్వారా మహిళలతో బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను రూపొందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు వారు కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ, పీఆర్, ఆర్డీ ఉన్నతాధికారులతో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు, విధి విధానాలపై చర్చించారు. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబర్తీ, టీజీ ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చించారు.
మహబూబ్ నగర్, కరీంనగర్ ఎంపిక
తొలి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్ లను ఎంపిక చేశారు. మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
వాటి నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకునున్నారు.