
- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : హుజూరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పిటిషనర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నట్టుగా ఈ నెల 27 తర్వాత చెక్కులు చెల్లకుండాపోవని, వాటికి ఆగస్టు వరకు చెల్లుబాటు ఉందని అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ చెప్పారు. ఇప్పటికే 71 మంది లబ్ధిదారుల చెక్కులు బ్యాంకులకు పంపించామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చెక్కులు అందజేస్తామన్నారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు..
పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జులై 15కు వాయిదా వేసింది. హుజూరాబాద్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయకుండా తనను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ కేవలం రాజకీయం కోసమే ఈ పిటిషన్ వేశారని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీపై పూర్తి వివరాలు అందజేసేందుకు సమయం కావాలని కోరడంతో, హైకోర్టు అందుకు అనుమతిచ్చింది.
చపాతీ రోలర్ పై పిటిషన్ వాపస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో చపాతీ రోలర్ గుర్తును చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు లాయర్ వాదిస్తూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ఫార్మ్స్ పార్టీ అభ్యర్థులు చపాతీ రోలర్ గుర్తుపై పోటీ చేశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని కోరారు.
ఈసీ తరఫున లాయర్ జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఫలానా గుర్తు కావాలని ఎవరూ కోరలేరని చెప్పారు. జాబితాలో ఉన్న గుర్తుల నుంచే ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ లాయర్ కోరడంతో హైకోర్టు అందుకు అనుమతిచ్చింది.