దేశ వ్యాప్తంగా రైళ్ల స్పీడ్​ 160 కి.మీ.

దేశ వ్యాప్తంగా రైళ్ల స్పీడ్​ 160 కి.మీ.

దేశవ్యాప్తంగా రైళ్ల వేగం 130 నుంచి 160 కిలో మీటర్లకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా తెలిపారు. 2022 వరకు కాజీపేట, బల్లార్ష జంక్షన్ల మధ్య  మూడో రైల్వే లైన్​ పనులు పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం మనోహరాబాద్​, నిజామాబాద్​ మీదుగా పెద్దపల్లి వరకు రైల్వే లైన్​ను ఆయన పరిశీలించారు. రెండున్నరేళ్ల క్రితం పూర్తయిన నిజామాబాద్–​-పెద్దపల్లి రైల్వే లైన్​ పనులు పరిశీలించి సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. కొత్త రైలు మార్గంలో రైళ్ల వేగం 50 నుంచి 70 కిలో మీటర్లకు పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ప్రస్తుతం పెద్దపల్లి నుంచి జగిత్యాలలోని లింగంపల్లి వరకు రైల్వే లైన్​ఎలక్ట్రికల్​ పనులు పూర్తయ్యాయని చెప్పారు.

లింగంపల్లి నుంచి నిజామాబాద్​ వరకు ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పెద్దపల్లి– నిజామాబాద్​మార్గంలో లింగంపల్లి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిలో గూడ్స్​షెడ్లు నిర్మించాలని డిమాండ్​ఉందని, వీటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  న్యూఢిల్లీ నుంచి చైన్నయ్​వరకు, ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి చైన్నయ్​,  చైన్నయ్​ నుంచి ముంబై మార్గాల్లో రైళ్ల వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొదట 130 కిలో మీటర్లకు తర్వాత160 కిలో మీటర్లకు వేగం పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రూట్లలో ఉన్న అన్ని లెవల్​ క్రాసింగ్​లను మూసి వేస్తామని, పాలసీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు.  సికింద్రాబాద్​ నుంచి తిరుపతి, షిర్డీ రైళ్ల కోసం డిమాండ్​ఉందని, కొత్త రైళ్లు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.