కోర్టు తీర్పు ఇచ్చినా
అమలు చేయని సర్కారు
23,667 మందికి సర్వీస్
రూల్స్ వర్తింపజేయాలని కార్మికుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వచ్చి ఐదేళ్లలో కాంట్రాక్ట్ కార్మికుల పేరు ఆర్టిజన్లుగా మారిందే తప్ప రెగ్యులరైజ్ కాలేదని కరెంట్ ఆర్టిజన్లు ఆవేదన చెందుతున్నారు. వేతన స్కేలు, టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ వంటివేవీ అమలు కావడం లేదంటున్నారు. 1959 నుంచి కరెంట్ కంపెనీల్లో కొనసాగుతున్న ఏపీఎస్ఈబీ విధానాలు అమలు చేయట్లేదంటున్నారు. ఇవన్నీ లేకుండా తాము రెగ్యులరైజ్ ఎలా అయినట్టని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సంతకంతో 23 వేల మంది కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని 2013 అక్టోబరు 5న ఉద్యమ నేతగా మింట్ కాంపౌండ్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ, రాష్ట్రం వచ్చాక కూడా అమలు చేయలేదని టీటఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం 25 వేలు దాటలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో 23,667 మంది ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు సిద్ధమవుతున్నారు ఆర్టిజన్ కార్మికులు. పీస్రేట్తో పనిచేసే ఎస్పీఎం, ఎంఆర్జీ, స్టోర్ వర్కర్స్, స్పాట్ బిల్లింగ్, పీసీఏ, పీఏఏ వంటి 6,500 మంది కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పాత రూల్స్ కాదని కొత్తగా తెస్తున్న స్టాండింగ్ ఆర్డర్స్ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కోర్టు తీర్పు ఇచ్చినా…
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు 2017 జులై 29న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్టిజన్లుగా పేరు మార్చింది. జీతాన్ని 14 వేల రూపాయలు చేసింది. అయితే, ఉత్తర్వులొచ్చిన మూడు రోజులకే సత్యం రెడ్డి అనే లాయర్, కార్మికుల రెగ్యులరైజేషన్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 2018 జులై 21న ఆర్టిజన్లు సమ్మెకు దిగారు. అదే నెల 29న కార్మికులతో విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపారు. జీతాన్ని రూ.14 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. కోర్టు ఓకే చెప్పగానే రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చింది. కానీ, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చంటూ గత ఏడాది సెప్టెంబర్ 18న కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చేయలేదు. ఆర్టిజన్లందరినీ రెగ్యులరైజ్ చేసి ఉద్యోగాలిచ్చినట్టు అసెంబ్లీలో ప్రకటించినా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చే వెసులుబాట్లేవీ వాళ్లకు అందట్లేదు. ప్రమాదాల్లో ఆర్టిజన్లు చనిపోయినా వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల్లో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ కంపెనీల రూల్స్ను అమలు చేస్తామని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చెబుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్లను సాధించుకోవడానికి ఆందోళనలు
చేస్తున్నారు.
ఇవీ డిమాండ్లు
23,667 మంది ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి
6,500 మంది పీస్ రేట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి
పర్మనెంట్ ఉద్యోగుల ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలి
స్టాండింగ్ ఆర్డర్స్ను వెనక్కు తీసుకోవాలి
కరెంట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి
నోషనల్ ఇంక్రిమెంట్లోని తేడాలను తగ్గించాలి
ఒకే కంపెనీలో రెండు విధానాలుండొద్దు
స్కేల్, ప్రమోషన్లు, బదిలీలు, హెచ్ఆర్ఏ, టీఏ, డీఏ, కారుణ్య నియామకాలు వంటి 70 డిమాండ్లు
వరంగల్ సభ తర్వాత సమ్మె
కరెంట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరాం. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే రూల్స్నే ఆర్టిజన్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రైవేటు తరహాలో అమలు చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. నోటీసిచ్చే ఉద్యమిస్తున్నాం. వరంగల్ సభ తర్వాత మెరుపు సమ్మె చేస్తం. – పద్మారెడ్డి, చైర్మన్, టీటఫ్