ట్రిపుల్​ ఆర్ సర్వే నిలిపేయండి : యాదాద్రి కలెక్టరేట్​ఎదుట బాధితుల ఆందోళన

ట్రిపుల్​ ఆర్ సర్వే నిలిపేయండి : యాదాద్రి కలెక్టరేట్​ఎదుట బాధితుల ఆందోళన

యాదాద్రి, వెలుగు: ట్రిపుల్​ఆర్​సర్వే నిలిపివేయాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన బాధితులు సోమవారం కలెక్టరేట్​ఎదుట ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్​ఆర్​వల్ల పచ్చటి వ్యవసాయ భూములను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. నాగండ్లు, పాల క్యాన్​లు, పచ్చటి గడ్డితో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. కలెక్టరేట్​ ఎదుట పాలు పారబోస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్​రింగ్​రోడ్డు కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాయగిరి, వలిగొండ, చౌటుప్పల్​తదితర 23 గ్రామాల్లో 1,853.04 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాయగిరి పరిధిలో సెంట్రల్​వస్తుండడం వల్ల ఈ ఒక్క గ్రామంలోనే 70 మందికి పైగా రైతులు 266.14 ఎకరాలను కోల్పోతున్నారు. 

గతంలోనూ వివిధ ప్రాజెక్టుల పేరుతో  భూములు కోల్పోవడంతో రైతులు నిరంతరంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సర్వేను అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్​ ఎదురుగా పలుసార్లు ఆందోళన చేసినా.. కలెక్టర్​పమేలా సత్పతి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో న్యాయం చేయాలంటూ సోమవారం మరోసారి ఆందోళనకు దిగారు. హైదరాబాద్​–- వరంగల్​రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్​లోనికి వెళ్లి బైఠాయించారు. చివరకు ప్రజావాణిలో ఉన్న కలెక్టర్​ను కలిసి సర్వే నిలిపి వేయించాలని కోరారు. ప్రభుత్వానికి మీ ఆవేదన తెలుపుతామంటూ కలెక్టర్​హామీ ఇచ్చారు. గతంలోనూ ఇదే విధంగా హామీ ఇచ్చారని, కానీ సర్వే అపడం లేదంటూ బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించారు.