- 20 నుంచి 30 శాతం లైట్లు బంద్
- కొన్నిచోట్ల పట్టపగలే వెలుగులు
- చాలా చోట్ల రాత్రి వేళ లైట్లు వెలగక అంధకారం
- టెండర్లు వేయాలని జీవో ఇచ్చినా నో రెస్పాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ మూలకు పడింది. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో 20 నుంచి 30 శాతం లైట్లు వెలగడం లేదు. ఇందులో టైమర్లు పనిచేయక కొన్నిచోట్ల 24 గంటలు వెలుగుతుండగా, ఇంకొన్ని చోట్ల రాత్రి వేళ లైట్లు వెలగక అంధకారం అలుముకుంటోంది. రద్దీగా ఉండే రోడ్లపై కూడా వీధిలైట్లు, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు వెలగడంలేదు. దీంతో సాయంత్రం ఆరుదాటితే మెయిన్రోడ్లు, కాలనీలు, బస్తీలు చీకట్లోనే ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
టెండర్లు వేయాలని చెప్పినా..
ఇంతకుముందు పాత జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) స్ట్రీట్ లైట్లను మెయింటెనెన్స్ చేసింది. ఏడాది కింద ఈ సంస్థ ఒప్పందం ముగిసింది. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ నేరుగా మెయింటెనెన్స్ చేస్తోంది. గతేడాది డిసెంబర్ లో 27 స్థానిక సంస్థల విలీనంతో పాటు మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. అప్పటి నుంచి ఆయా కార్పొరేషన్లే నేరుగా స్ట్రీట్లైట్స్ను మెయింటెయిన్చేసేవి.
అప్పుడు కూడా 30 శాతానికిపైగా లైట్లు వెలగలేదు. విలీనమైన ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో మూడు కార్పొరేషన్లకి కలిపి జీహెచ్ఎంసీనే టెండర్లు వేసి ఏజెన్సీలను ఫైనల్ చేయాలని గత నెల మార్చి 6న ప్రభుత్వం జీవో రిలీజ్చేసింది. అయినా దీనిపై ఇప్పటికీ క్లారిటీ రావడంలేదు. ఎలా చేద్దాం? ఏం చేద్దాం అనే దానిపై పలువురు జోనల్ కమిషనర్లు, ఇంజినిరింగ్ ఉన్నతాధికారులో కలిసి ఓ కమిటీ వేసినా అది ముందుకు సాగడం లేదు.
ఏడు లక్షల స్ట్రీట్ లైట్లు
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 7,60,591 స్ట్రీట్ లైట్లున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 3,30,487, సీఎంసీలో 1,85,258, ఎంఎంసీలో 2,44,846 ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కోసం రూ.1,341కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించామని జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాల్సి ఉండగా, బల్దియా కేవలం వెలిగే లైట్లకు మాత్రమే మెయింటెనెన్స్ చార్జీలను చెల్లించాలని భావిస్తోంది.
ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల పట్టేలా ఉంది. టెండర్ల వరకు జీహెచ్ఎంసీదే బాధ్యత అయినా, ఆ తర్వాత నిర్వహణకి సంబంధించి ఏజెన్సీలను ఆయా కార్పొరేషన్లే పర్యవేక్షించనున్నాయి
