- డీఈవోలకు నవీన్ నికోలస్ ఆర్డర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్ల కులా ల వారీ వివరాలను సేకరించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. తెలంగాణ బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు బడుల్లోని విద్యార్థుల సమగ్ర కులగణన డేటాను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్.. డీఈఓలను ఆదేశించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఐజీసీఎస్ఈ తదితర సిలబస్ అనుసరించే స్కూళ్లన్నీ తప్పనిసరిగా స్టూడెంట్ల కులాల వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఏ ఒక్క విద్యార్థి రికార్డు కూడా కులం వివరాలు లేకుండా ఉండకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ డేటా సేకరణ ప్రక్రియను జిల్లా స్థాయిలో డీఈవోలు ప్రతిరోజూ పర్యవేక్షించాలని నవీన్ నికోలస్ డైరెక్టర్ సూచించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటూ వివరాల నమోదులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
