బెంగాల్‎లో ఆర్జీకర్ తరహా మరో ఘటన: కాలేజ్ క్యాంపస్‎లోనే లా స్టూడెంట్‎పై గ్యాంగ్ రేప్

బెంగాల్‎లో ఆర్జీకర్ తరహా మరో ఘటన: కాలేజ్ క్యాంపస్‎లోనే లా స్టూడెంట్‎పై గ్యాంగ్ రేప్

కోల్‎కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అదే తరహా ఘటన మరొకటి జరిగింది. లా చదువుతోన్న ఓ విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


వివరాల ప్రకారం.. దక్షిణ కోల్‌కతా‎లోని కస్బా ప్రాంతంలో ఓ లా కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‎కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. 2025, జూన్ 25న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బాధితురాలి చదువుతోన్న కాలేజీకి చెందిన ఇద్దరు, అదే కళాశాలకు చెందిన ఓ పూర్వ విద్యార్థి ముగ్గురు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. కాలేజీ క్యాంపస్ ఆవరణలోనే అత్యాచారానికి పాల్పడారని పోలీసులు చెప్పారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కళాశాల మాజీ యూనిట్ ప్రెసిడెంట్‌ 31 ఏళ్ల మోనోజిత్ మిశ్రా, 19 ఏళ్ల జైబ్ అహ్మద్, 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీగా పోలీసులు గుర్తించారు. జూన్ 26 సాయంత్రం కోల్‌కతాలోని తల్బాగన్ క్రాసింగ్ సమీపంలోని సిద్ధార్థ శంకర్ శిశు రాయ్ ఉద్యాన్ ఎదురుగా ఇద్దరు నిందితులు మిశ్రా, అహ్మద్‌లను అరెస్టు చేశారు. 

జూన్ 27న తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో మూడవ నిందితుడు ముఖర్జీని అతని నివాసంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తోందని తెలిపారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ విద్యార్థి అని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలు, యువతులు, పిల్లలకు రక్షణ కరువైపోయిందని విమర్శిస్తున్నారు.