వంద గుంజిళ్లు తీయించిన టీచర్, బౌన్సర్
ఆ తర్వాత పావుగంట సేపు గోడకుర్చీ కూడా
ఆ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి ఒక్కటే కిడ్నీ ఉంది. దాంతో ఎన్నో సమస్యలు. అయినా, టీచర్ కనికరించలేదు. ఒక్కటే కిడ్నీ అన్న జాలి చూపించలేదు. బయటనిలబెట్టాడు. స్కూల్లోని బౌన్సర్ సాయం తీసుకుని అతడితో వంద గుంజిళ్లు తీయించాడు. అది చాలదన్నట్టు పావుగంట సేపు గోడ కుర్చీ వేయించాడు. దీంతో పదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడికి తీవ్రమైన కడుపు, కాళ్ల నొప్పి వేధించింది. తల్లిదండ్రులు టీచర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో ఉన్న మహవీర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో సోమవారం జరిగింది. అంత పెద్ద శిక్ష వేయడానికి అతడు చేసిన తప్పు, ఇంటి దగ్గర హిందీ వర్క్బుక్ మరచిపోయి రావడమే. తల్లిదండ్రుల ఫిర్యాదుతో టీచరు, బౌన్సర్పై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, సెక్షన్ 75 (పిల్లలపై క్రూరత్వం) కింద స్వరగేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో మరికొందరి పేర్లనూ చేర్చాల్సి ఉంది. యాజమాన్యం చెప్పడం వల్లే టీచర్ ఆ శిక్ష విధించాడు” అని స్వరగేట్ పోలీసులు తెలిపారు. అయితే, స్కూలు యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘మేం 15 నుంచి 20 గుంజిళ్లు మాత్రమే తీయమన్నాం. కడుపులో నొప్పి అనగానే ఆపేయమని చెప్పాం. క్రమశిక్షణలో పెట్టాలంటే ఆ మాత్రం శిక్ష అయినా వేయాలి కదా. లేకపోతే పిల్లలు ఎలా గాడిలో ఉంటారు?” అని మహావీర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అలకనంద సేన్గుప్తా వివరించారు. బుధవారం స్కూలులో విద్యాశాఖ అధికారులు విచారణ జరిపినట్టు పుణే జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫర్ సెకండరీ స్కూల్స్ గణపత్ మోరె చెప్పారు. ఇంతకుముందు తన చిన్న కొడుకునూ చావబాదారని, బౌన్సర్పై ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్ సరిగ్గా స్పందించలేదని రాలేదని ఆ అబ్బాయి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.