- హకీంపేట స్పోర్ట్స స్కూల్ వద్ద స్టూడెంట్ల ఆందోళన
శామీర్పేట, వెలుగు : సస్పెండ్ అయిన ఓఎస్డీ హరికృష్ణ సార్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వద్ద స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. శనివారం స్టూడెంట్లు క్లాసులు బహిష్కరించి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. ఓఎస్డీ హరికృష్ణపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. అందరం ఇక్కడే ఉన్నామని, కావాలంటే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చన్నారు.
స్పోర్ట్స్ స్కూల్ మెయిన్ గేటు ఎదుట స్టూడెంట్లు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారని.. వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయని పోలీసులు చెప్పడంతో స్టూడెంట్లు ఆందోళన విరమించారు.