పీజీ వరకు ఫ్రీగా చదువుకోవచ్చు: ఆర్ కృష్ణయ్య

పీజీ వరకు ఫ్రీగా చదువుకోవచ్చు: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్య ద్వారానే కుటుంబ గౌరవం, సమాజ గుర్తింపు లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్ బీసీ భవన్ వద్ద నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బడికి పోదాం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. పేదరికంలో ఉన్నవారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు లేదా హాస్టళ్లలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు.

రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో కూడిన గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని, పీజీ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విద్య ద్వారానే పేదరికం తొలగి, జ్ఞాన సమాజం ఏర్పడుతుందని, సమాజంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. గుజ్జ సత్యం, సీ రాజేందర్,  రామకృష్ణ  పాల్గొన్నారు.