
శంషాబాద్, వెలుగు: స్కూల్ బస్సు కల్వర్టులో ఇరుక్కుపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. శంషాబాద్లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ చెందిన బస్సు 40 నుంచి 50 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం కేబీ దొడ్డి నుంచి సుల్తాన్ పల్లి మీదుగా వెళ్తుంది. ఈసీ వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కల్వర్టు పైనుంచి వెళ్తూ ఇరుక్కుపోయింది. భయంతో బస్సులోని విద్యార్థులు కేకలు వేయడంతో స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి విద్యార్థులను క్షేమంగా కిందకు దించారు. అనంతరం జేసీబీతో బస్సును బయటికి తీశారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉంటే బస్సు కొట్టుకుపోయేదని, ఇప్పటికైనా అధికారులు కేబీ దొడ్డి – సుల్తాన్ పల్లి మధ్యలోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరారు. రోడ్డు కోసం నిధులు కేటాయించినా ఇంకా నిర్మాణం చేయడంలేదని మండిపడ్డారు.