ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!

ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!
  •     క్యాంపెయిన్​ కు ప్రధాని మోదీ కూడా వస్తారని ప్రచారం ​ ​ 
  •     ఇవాళ ర్యాలీకి రానున్న కేంద్రమంత్రి రాజ్​నాథ్​ 
  •     పలువురు బీజేపీ సీఎంలు వస్తారంటున్న నేతలు

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్ సీటుపై బీజేపీ ఫోకస్​  పెట్టింది. సంస్థాగతంగా ఏ మాత్రం బలంలేని సెగ్మెంట్ అయినా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో బీజేపీ తరఫున కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్​ క్యాంపెయిన్​ కు రానున్నారు.

ఇప్పటికే పలువురు సీనియర్​ నేతలు ఖమ్మం వచ్చేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని, ప్రధాని మోదీ షెడ్యూల్​పై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు చెబుతున్నారు. అలాగే కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్​దేవ్ ను క్యాంపెయిన్ కు రప్పించాలని  చూస్తున్నారు.  శుక్రవారం వినోద్​రావు నామినేషన్​ సందర్భంగా ర్యాలీలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్ సింగ్ ఖమ్మం రానున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్​ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ కో- ఇన్​చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.   

చేరికలపై ఫోకస్..​

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మీటింగ్ కు అటెండయ్యారు. ఇప్పుడు కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో మళ్లీ ముఖ్య నేతలను రంగంలోకి దింపేందుకు బీజేపీ ప్లాన్​ చేస్తోంది. మరోసారి అమిత్ షాను ఖమ్మం రప్పించేందుకు జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షాతో పాటు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరికొందరు ముఖ్య నేతలు ఖమ్మంలో రోడ్​ షోలకు అటెండ్​ అవుతారని జిల్లా నేతలకు సమాచారం అందింది.

మరోవైపు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్​దేవ్ తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయనను ఎలక్షన్​ క్యాంపెయిన్ కు రప్పించాలని వినోద్ రావు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు వచ్చిన సమయంలో చేరికలకు కూడా బీజేపీ ప్లాన్​ చేస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్​ క్యాడర్​ ను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్​ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు కొంత అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించి పార్టీలోకి రప్పించేందుకు చర్చలు జరుపుతోంది. కొంత మంది కార్పొరేటర్లు, మండల స్థాయి నాయకులు ఇప్పటికే తమతో టచ్​ లో ఉన్నారని, సరైన సమయంలో వారిని పార్టీలో చేర్చుకుంటామని బీజేపీ లీడర్లు చెబుతున్నారు. 

టీడీపీ కేడర్​పై ఆశలు..

వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్​ ను మాత్రమే ఆ పార్టీ గెల్చుకుంది. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత ఊపు కనిపించినా, జనసేనతో పొత్తు పెట్టుకొని జిల్లాలోని మెజార్టీ స్థానాలను కేటాయించడంతో బీజేపీ కేడర్​ నిరుత్సాహానికి గురైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఓట్లను కూడా, మొన్నటి ఎన్నికల్లో పొందలేకపోయింది.

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. దీంతో ఖమ్మంలో కొంతమేర ప్రభావం ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్​ ను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి వినోద్ రావు జిల్లా టీడీపీ ఆఫీస్​ కు వెళ్లి, తమకు మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలను కోరారు. అదే సమయంలో సొంతంగా బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకొని, రెండో దఫా ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్​ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, బీఆర్ఎస్​ అభ్యర్థిని ప్రకటించినా ఆ పార్టీ కేడర్​ ఇంకా గత ఎన్నికల్లో ఓటమి తాలూకు నిరుత్సాహాన్ని వీడకపోవడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది.