జూన్ నెల వచ్చినా ఎండలు మండిపోతున్నాయి... రుతుపవనాల రాక ఆలస్యమవ్వడంతో మరి కొన్ని రోజులు ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గురువారం ( జూన్ 4 ) ఉదయం నుండి ఎండ దంచికొట్టినప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి చిరుజల్లులు కురిశాయి. ఈ దెబ్బతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయి సిటీ చల్లబడింది.
వర్షం కురిసే సమయంలో రోడ్ల మీద ఉన్న వాహనదారులు చిరుజల్లులతో రిలీఫ్ అయ్యారు. అప్పటిదాకా ఎండలో ట్రాఫిక్ జామ్ లో విసిగిపోయిన జనం ఒక్కసారిగా కురిసిన చిరుజల్లులతో ఉపశమనం పొందారు.
కరీంనగర్ జిల్లాలో వర్షం:
కరీంనగర్ జిల్లాలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, మనుకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, హుజురాబాద్ మందలాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురవగా... మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుండి విపరీతమైన ఎండ వేడితో అల్లాడిన జనం వర్షంతో ఉపశమనం పొందామని అంటున్నారు.
మెదక్ జిల్లాలో ఓ ఇంటిపై పిడుగు:
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. నిజాంపేట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. అయితే.. పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
