అప్పుల బాధ: కొడుకుతో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్యా భర్తల మృతి

అప్పుల బాధ: కొడుకుతో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్యా భర్తల మృతి

భార్యా, భర్తల మృతి.. ప్రాణాపాయం నుండి బయటపడ్డ కొడుకు

కరీంనగర్: అప్పుల బాధతో భార్యా భర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జ్యోతినగర్ లో జరిగింది. 11 ఏళ్ల కొడుకుతో సహా వీరు ఆత్మహత్యకు ప్రయత్నించగా.. కొడుకు మాత్రం ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. విషాదకర ఘటన స్థానికంగా కలకం రేపింది.

కొంత కాలంగా అప్పులపాలై తీవ్రంగా ఇబ్బందిపడుతున్న సమ్మయ్య (40).. అప్పుల వారికి సమాధానాలు చెప్పలేక కుమిలిపోయాడు. భార్య కృష్ణవేణి (32)  కూడా అదే పరిస్థితిలో ఉంది. ఈ కష్టాలు భరించలేకపోతున్నాము.. తాము చనిపోతే తమ 11 ఏళ్ల కొడుకు ఏమవుతాడోననే భయంతో కొడుకు తో సహా  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి బాధతో విలవిలలాడుతున్న సమ్మయ్య కుటుంబ సభ్యులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే సమ్మయ్య (40) కన్నుమూయగా..  మరో రెండు గంటల తర్వాత భార్య కృష్ణ వేణి కూడా తుదిశ్వాస విడిచింది. పురుగుల మందు తాగిన కుటుంబ సభ్యులను కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నం చేయగా.. దంపతుల కొడుకు మోక్షజ్ఞ (11) ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అప్పుల బాధతోనే వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు.