పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్లో సోమవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో పారామిలటరీ హెడ్క్వార్టర్స్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు ఫెడరల్ కాన్స్టాబులరీ (ఎఫ్ సీ) సిబ్బంది చనిపోయారు. మరికొంతమంది సిబ్బందితో పాటు నలుగురు స్థానికులు గాయపడ్డారు. హెడ్క్వార్టర్స్ లోపల రెండుచోట్ల పేలుళ్లు జరిగాయని ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ జుల్ఫికార్ హమీద్ తెలిపారు.
మొదటి సూసైడ్ బాంబర్ హెడ్క్వార్టర్స్ మెయిన్ గేట్ వద్ద తనను తాను పేల్చుకున్నాడని, ఆ తర్వాత మరో ఇద్దరు దుండగులు కాంపౌండ్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని.. అనంతరం మోటార్ సైకిల్ పార్కింగ్ సమీపంలో పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపారు. ఇద్దరు దుండగులను భద్రతా బలగాలు కాల్చి చంపేశాయని పెషావర్ పోలీస్ చీఫ్ సయీద్ తెలిపారు.
