ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు ఘనాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (38) అనే మహిళ తన కూతురితో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.చుట్టు పక్కల వారు అడ్డుకోవడంతో .. వారు తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. భర్త చనిపోతే రైతు ఆర్థిక సహాయం కింద వచ్చిన డబ్బులు డ్రా చేయనివ్వకుండా ఎమ్మార్వో శ్రీనివాస్ రావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. 

కుల్కచర్ల మండలం ఘనాపూర్ గ్రామానికి చెందిన దండు సాయిలు అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో 2017 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జి పెట్టుకోగా 2019 ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం కింద మంజూరయ్యాయి.చెక్ రూపంలో ఉన్న ఆర్థిక సహాయం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భార్య రాములమ్మ, కుల్కచర్ల తహశీల్దార్ పేరిట జాయింట్ అకౌంట్లో జమ అయ్యాయి. కుటుంబానికి ఆర్థిక సహాయం చేదోడు వాదోడుగా ఉంటుందని....వాటితో గేదేలు కొని జీవనం కొనసాగిద్దామనుకున్న వారికి తహశీల్దార్ కార్యాలయంలో చుక్కెదురైంది.బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేందుకు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ 2019 నుండి కళ్ళరిగేలా తిరుగుతున్నానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పొంతన లేని సమాధానాలు చెబుతూ తమను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని....కుటుంబ పరిస్థితి బాగాలేక చేసిదేమి లేక తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.