రాజేంద్రనగర్: లక్షలు ఖర్చుపెట్టినా తన తల్లి బతకలేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధుబాన్ కాలనీకి చెందిన రుక్మిణి(60)కి ఇటీవల కరోనా సోకింది. దీంతో రుక్మిణిని ఆమె కొడుకు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. కొవిడ్ తో చికిత్స పొందుతూ తన తల్లి రుక్మిణి ఆసుపత్రిలో చనిపోయింది. అప్పటికే లక్షల రూపాయలు ఆసుపత్రి ఫీజుగా చెల్లించిన ఆమె కుమారుడు శ్రీహరి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
హాస్పిటల్ డాక్టర్లు తన తల్లిని చంపేశారంటూ ఓ సెల్ఫీ వీడియో తీసిన శ్రీహరి అనంతరం పహడీషరీఫ్ పీఎస్ పరిధిలోని ఓ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పహడీషరీఫ్ పోలీసులు ..చెరువులో నుండి శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.