44 క్రీడల్లో శిక్షణ..ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంపులు

44  క్రీడల్లో శిక్షణ..ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంపులు

సమ్మర్ వచ్చేసిందంటే చాలు..విద్యార్థులు, చిన్నారులు  ఏదో ఒక ఆటను నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకే ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపుల్లో చేరుతుంటారు. ఈ క్రమంలోనే  జీహెచ్ఎంసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయబోతుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు. 

ఎన్ని క్రీడలు..ఏ వయసు పిల్లలు..

సమ్మర్‌ క్యాంపుల్లో భాగంగా మొత్తం 44 రకాల క్రీడల్లో  6 నుంచి 16 సంవత్సరాలలోపు పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు http://www.ghmc.gov.in/sports వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. స్పోర్ట్స్‌ క్విజ్‌, జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్స్‌తో ముఖాముఖి, క్రీడలపై స్ఫూర్తిని పెంచేలా ఆటల నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తారు.

ఏ ఏ మైదానాల్లో ..

ఈ నెల 25 ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్‌ జోన్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌, 26న సాయంత్రం 4 గంటలకు చార్మినార్‌ జోన్‌ కులీకుతుబ్‌షా స్టేడియం, 27న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌ జోన్‌లో మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్‌.., 28న కూకట్‌పల్లి, శేరిలింగపల్లి జోన్‌ పీజేఆర్‌ చందానగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ స్టేడియం.., 29న ఎల్బీనగర్‌ జోన్‌ ఉప్పల్‌ స్టేడియంలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు ప్రారంభం అవుతాయి. మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ SSC టోర్నమెంట్‌లో భాగంగా 16 రకాల గేమ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న చార్మినార్‌ జోన్‌ కులీకతుబ్‌షా స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, మే 31న ఖైరతాబాద్‌ జోన్‌ విక్టరీ ప్లే గ్రౌండ్‌లో సాయంత్రం ముగిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.