ప్రస్తుతం ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంలో నటిస్తున్న సందీప్ కిషన్.. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఆరేళ్ల క్రితం తను హీరోగా వచ్చిన ‘మాయావన్’కి ఇది సీక్వెల్. సీవీ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్కు దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్కి జెమిని కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. సూపర్విలన్ని ఢీ కొట్టే ఒక సామాన్యుడి కథతో తెరకెక్కిస్తున్నాం. నవంబర్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.