న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టైనా సరే సీఎం పదవికి రాజీనామా చేయొద్దని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇటీవల కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీలో ‘మై భీ కేజ్రీవాల్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఇందులో 23 లక్షల కుటుంబాలను ఆప్ కార్యకర్తలు కలిసి, సంతకాలు సేకరించారు.
ఈ కార్యక్రమం వివరాలను ఢిల్లీ మాజీ మంత్రి జితేంద్ర తోమర్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ‘కోటి మంది ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోను సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకూడదని 98% మంది ప్రజలు కోరుకున్నారు” అని తోమర్ తెలిపారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఈడీ రెండుసార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.