మక్కలకు మద్దతు ఇవ్వం.. వేస్తే మీ ఇష్టం

మక్కలకు మద్దతు ఇవ్వం.. వేస్తే మీ ఇష్టం

హైదరాబాద్: మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి..  రాష్ట్రంలో కూడా  ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. అందుకే మక్కలకు మద్దతు ఇవ్వం.. వేస్తే మీ ఇష్టం అని రైతులకు సూచించారు సీఎం కేసీఆర్. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం, దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్దఎత్తున తగ్గించడం,  పేదరైతు పాలిట శాపంగా పరిణమించిందన్నారు. పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై శనివారం ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొని చర్చించారు. అంతర్జాతీయ మార్కెట్లో అవసరాలకుపోను 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వలున్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే సాలీనా అవసరం కాగా, 3 కోట్ల 53 లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందన్నారు. అంటే 1 కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయని, దీనికితోడు వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న దాదాపు 4 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట త్వరలోనే మార్కెట్లోకి విడుదలవుతుందని, దీంతో ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా స్టాకు ఉందని  అధికారులు వివరించారు. ఈ పరిస్థితి ఇలావుంటే, కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి నిర్ణయించడం పరిస్థితులను మరింత దిగజార్చిందని అధికారులు సిఎంకు వివరించారు.  మొక్కజొన్నల మీద విధించే 50 శాతం దిగుమతి పన్నును 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాలనుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తద్వారా దేశంలోని రాష్ట్రంలోని  మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక మొక్కజొన్న రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందన్నారు.

తెలంగాణలో ఉన్న మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలనే ఉద్దేశ్యంతో, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయశాఖ చర్చలు జరిపిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు.  అయితే, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో  కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణలో పండిన మొక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు  సుముఖంగా లేరని మంత్రి తెలిపారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మొక్కజొన్నకు కనీస మద్దతు ధర లభించడం అసాధ్యమేనని సమావేశం అభిప్రాయపడింది.