స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. జస్టిస్ నారిమన్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 10 మంది కరోనా రోగులు చనిపోతే.. కారణాలు తెలుసుకోకుండా రమేష్ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. 10 మంది ఒకేచోట.. ఒకే ప్రమాదంలో.. అందులోనూ ఆస్పత్రిలో చనిపోతే కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం అని వాదించారు. స్వర్ణప్యాలెస్ నిర్వాహకుడు, రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‍పై కస్టోడియల్ విచారణ చేయవద్దన్న హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ప్రమాద దర్యాప్తును నిలిపివేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విచారణకు అనుమతిస్తూనే కొన్ని షరతులు విధించింది.