BS4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన సుప్రీం కోర్టు

BS4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన సుప్రీం కోర్టు

BS4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు లాక్ డౌన్ కాలంలో అమ్మిన BS4 వాహనాల రిజిస్ట్రేషన్లను జరుపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యంత పరిశుభ్ర ఉద్గారాలు వెలువరించే BS6  టెక్నాలజీని తాము ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని అనుకుని..మార్చి 31తో BS4 వాహనాలకు తుది గడువు నిర్దేశిస్తే, మార్చి 31 తర్వాత కూడా BS4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతకుముందు, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా BS4 వెహికిల్స్ మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును ఆశ్రయించగా… కోర్టు 10 రోజుల వ్యవధిలో 10 శాతం BS4 వాహనాలను మాత్రమే అమ్మేందుకు అనుమతి ఇచ్చింది. తాము నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మొత్తంలో BS4 వాహనాలు అమ్ముడు కావడం సుప్రీం కోర్టును అసహనానికి గురిచేసింది. ఈ క్రమంలో బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది.