బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కరోనా వ్యాప్తి తో పాటు, భారీ వరదలు సంభవిస్తున్న ఈ సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు-28) కొట్టివేసింది. కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించేంత వరకు ఎన్నికలను నిర్వహించరాదంటూ బీహార్ కు చెందిన రాజేశ్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

అన్ని విషయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాల్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై సీఈసీదే తుది నిర్ణయమని తెలిపింది. బీహార్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే అవకాశం ఉంది.