- రిటర్నింగ్ ఆఫీసర్ను ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి
- చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీంలో విచారణ
- ఆర్వో, బీజేపీ నేత అనిల్మసీహ్ను స్వయంగా విచారించిన సీజేఐ
- స్వతంత్ర భారత దేశంలో ఇదే తొలిసారి అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేస్తూ, అవి చెల్లవని రిటర్నింగ్ ఆఫీసర్ పక్కన పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన బీజేపీ నేత అనిల్మసీహ్ను విచారణకు పిలిచింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సోమవారం కోర్టుకు హాజరైన అనిల్ మసీహ్ను స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారించారు. కాగా, ఎన్నికల్లో అవకతవకల నేపథ్యంలో మరో నేతను రిటర్నింగ్ అధికారిగా ఎన్నుకుని, బ్యాలెట్ పేపర్లను మళ్లీ లెక్కించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోసారి పోలింగ్ నిర్వహించాలన్న ఆప్ డిమాండ్ను తోసిపుచ్చారు.
మేయర్ ఎన్నికలో ఏంజరిగింది..
గత నెల 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నేత మనోజ్ సోంకార్ గెలిచినట్లు ఆర్వో అనిల్ మసీహ్ ప్రకటించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో 8 ఓట్లు చెల్లవంటూ పక్కన పెట్టారు. అయితే, బీజేపీకి తగినంత బలంలేకున్నా సోంకార్ను గెలిపించేందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా గందరగోళం నెలకొంది.
ఆ సమయంలో బ్యాలెట్ పేపర్లపై ఆర్వో పెన్నుతో రాయడం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. తర్వాత ఈ వీడియో బయటకు రాగా.. బ్యాలెట్ పేపర్లపై అనిల్ మసీహ్ ఇంటూ మార్కు పెట్టడం స్పష్టంగా కనిపించింది. దీనిపై ఆప్ సుప్రీంను ఆశ్రయించింది.
సీజేఐ, బీజేపీ నేత మధ్య జరిగిన సంభాషణ..
సీజేఐ: మిస్టర్ మసీహ్.. ఇది చాలా సీరియస్ విషయం. మేమడిగే ప్రశ్నలకు నిజాయితీగా జవాబివ్వండి. సీసీ కెమెరా వైపు చూస్తూ బ్యాలెట్ పేపర్లపై మీరు ఇంటూ మార్కు పెడుతున్న వీడియోను మేమంతా చూశాం. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్కు ఎందుకు పెట్టారు?
మసీహ్: ఓటింగ్పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల పరిశీలనలో భాగంగా మార్క్ చేశాను. చెల్లని ఓట్లను వేరు చేయడానికే అలా చేశా.
సీజేఐ: ప్రత్యేకంగా కొన్ని పేపర్లను ఎంచుకుని మరీ మార్క్ చేయడం వీడియోలో కనిపించింది. కేవలం కొన్నింటిపైనే ఇంటూ మార్కు పెట్టారా?
మసీహ్: అవును
సీజేఐ: ఎన్ని పేపర్లపై అలా మార్క్ చేశారు?
మసీహ్: 8
సీజేఐ: బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేయాలని నిబంధనల్లో లేదు కదా. సంతకం చేస్తే సరిపోయేది, మరి ఎందుకలా చేశారు?
మసీహ్: కొంతమంది అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లను లాక్కుని చించేశారు. ఆ ప్రయత్నంలో మార్క్ చేశాను.
సీజేఐ: మిస్టర్ సొలిసిటర్, మీరు ఇతడిని ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎన్నికల ప్రాసెస్లో ఈయన జోక్యం చేసుకుంటున్నాడు.