- సమస్య పరిష్కారం కాకపోతే నేనే జోక్యం చేసుకుంటా: సీజేఐ
న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనల కారణంగా ప్రభుత్వం ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. గురువారం లంచ్ టైమ్లోగా సమస్యను పరిష్కరించకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. రవాణా సౌకర్యం లేక కోర్టుకు హాజరుకాలేని న్యాయవాదులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ధర్మాసనాలకు సూచించింది. మెట్రో ఆఫీసర్లతో మాట్లాడి వెంటనే మెట్రో స్టేషన్లు ఓపెన్ అయ్యేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టడంతో... భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు, మెట్రో యాజమాన్యం సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో సహా 16 స్టేషన్లను మూసివేసింది. స్టేషన్ల మూసివేత వల్ల లాయర్లు, కోర్టు సిబ్బంది సమయానికి తమ విధులకు హాజరు కాలేకపోయారు.
ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా జోక్యం చేసుకుంటానని బార్ అసోసియేషన్కు సీజేఐ సూర్యకాంత్ హామీ ఇచ్చారు.
