- బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసులో మహారాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం కొట్టివేసింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తు ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మహారాష్ట్ర సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.
ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. మహారాష్ట్ర తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు త్వరగా చేపట్టాలని బెంచ్ను అభ్యర్థించారు. అయితే, దీనికి సుప్రీం బెంచ్ నిరాకరించింది. తీర్పును వెనక్కి తీసుకునే సందర్భంలో తొందరపాటు కూడదని చెప్పింది. ఈ కేసులో బాధితులు నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఎంతో శ్రమించారని గుర్తుచేసింది. నిర్దోషిగా ప్రకటించిన తీర్పును అత్యవసరంగా మార్చాల్సిన అవసరంలేదని బెంచ్ వ్యాఖ్యానించింది.