
న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు బీసీ సర్టిఫికెట్ల జారీపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఒక ఒంటరి తల్లి ఓబీసీ అయినప్పటికీ.. ఆమె కమ్యూనిటీ, సర్టిఫికెట్ ఆధారంగా ఆమె పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో సమస్య ఏముంది? ఒంటరి తల్లలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ఆలోచన చేయాలి” అని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్తో కూడి డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీకి చెందిన ఓబీసీ మహిళ, ఒంటరి తల్లి తన పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల కోసం జనవరి 31న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుంచి విడిపోయానని, తన పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఆయన రక్తసంబంధీకుల(తాత, చిన్నాన్న, పెద్దనాన్న) సర్టిఫికెట్ అయినా కావాలని అధికారులు అంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
‘‘ప్రస్తుత నిబంధనల ప్రకారం.. తండ్రి, లేదా తండ్రి తరఫు రక్తసంబంధీకుల సర్టిఫికెట్ ఆధారంగానే పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒంటరి తల్లుల పిల్లల హక్కులను హరించేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒంటరి తల్లుల సర్టిఫికెట్ ఆధారంగానే పిల్లలకు సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు.
ఓబీసీలకు ఇది వర్తించట్లేదు” అని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. ‘‘ఇది ముఖ్యమైన అంశం” అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఏమంటారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. విడాకులు తీసుకున్న ఓబీసీ మహిళ.. పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం భర్తపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని సుప్రీం బెంచ్ అడిగింది. ఇంటర్క్యాస్ట్ మ్యారేజీల విషయంలోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.