
- బెంగాల్ గవర్నర్ బోస్పై పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు
- వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంను ఆశ్రయించిన మహిళ
న్యూఢిల్లీ: గవర్నర్లకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపునిచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 361పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పశ్చిమ బెంగాల్ ‘రాజ్ భవన్’లో గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని, అక్కడి అధికారులు అక్రమంగా నిర్బంధించారని ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ విచారించింది. ‘‘ఈ పిటిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 361లోని క్లాజ్ (2) ప్రకారం గవర్నర్కు కల్పించే రక్షణ పరిధిపై సమస్యను లేవనెత్తింది” అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యను పరిష్కరించడంలో అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని కూడా కోరింది.
లేటైతే న్యాయం కంటితుడుపు చర్యే
పిటిషన్ వేసిన మహిళ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ.. రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు ఉన్న రక్షణ.. దర్యాప్తును నిరోధించలేదని, ఇందులో సమయమే అసలైన విషయమని అన్నారు. ‘‘మినహాయింపు గవర్నర్ పదవీవిరమణ వరకే, అందుకే ఎంక్వైరీ జరగాలి. సాక్ష్యాలను సేకరించాలి” అని అన్నారు. ఏప్రిల్ 24, మే 2 తేదీల్లో రాజ్భవన్లో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధించారని సదరు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.